పంజాగుట్ల, వెలుగు: ఆదివాసీ, జానపద కళాఖండాల పరిరక్షణ కోసం ఆద్యకళ మ్యూజియంను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఆద్యకళ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయంలో మ్యూజియం ఏర్పాటు స్థల కేటాయింపు ఫైల్పై సీఎం సంతకం చేసినప్పటికీ అమలు కాకపోవడం సరికాదన్నారు.
జానపద పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ.. కోట్ల విలువైన జానపద, ఆదివాసీ కళాఖండాలను కాపాడటం కష్టంగా మారిందన్నారు. సామాజిక కార్యకర్త సజయ, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
